దివీస్ లేబొరేటరీస్​కు రూ. 96.68లక్షల జరిమానా విధించింది సెబీ. సంస్థ సీఎఫ్​ఓతో పాటు మరో ఏడుగురిపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో ఈ చర్యలకు ఉపక్రమించింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం... 2017 జులై 10న స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ వేళల్లో దివీస్‌ లేబొరేటరీస్‌, విశాఖపట్నంలోని తన యూనిట్‌-2పై యూఎస్‌ఎఫ్‌డీఏ విధించిన 'ఇంపోర్ట్‌ అలెర్ట్‌'ను ఎత్తివేసిందంటూ ఒక ప్రకటన జారీ చేసింది.

 

 

దివీస్‌ లేబొరేటరీస్‌ సీఎఫ్‌ఓతో పాటు మరో ఏడుగురిపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో సెబీ రూ.96.68 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు ఈ నెల 1న సెబీ పూర్తికాలపు సభ్యుడు జి.మహాలింగం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం... 2017 జులై 10న స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ వేళల్లో దివీస్‌ లేబొరేటరీస్‌, విశాఖపట్నంలోని తన యూనిట్‌-2 పై యూఎస్‌ఎఫ్‌డీఏ విధించిన 'ఇంపోర్ట్‌ అలెర్ట్'ను ఎత్తివేసిందంటూ ఒక ప్రకటన జారీ చేసింది. ఇది కంపెనీ షేరు ధరను ప్రభావితం చేసే (ప్రైస్‌ సెన్సిటివ్‌) సమాచారం.'ఇంపోర్ట్‌ అలెర్ట్'’ను ఎత్తివేసిన ఫలితంగా కలిగే ప్రభావంపై జులై 10న దివీస్‌ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత, ఆ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేశారు.

 

 

ఈ సమాచారాన్ని 'ఇన్‌సైడర్లు' జులై 7నే తెలుసుకొని దివీస్‌ షేర్లు కొనుగోలు చేసి, వాటిని జులై 10న విక్రయించి లాభపడ్డారని సెబీ పేర్కొంది. దీనికి సంబంధించి కంపెనీ సీఎఫ్‌ఓ ఎల్‌.కిషోర్‌ బాబు, ఆయన సన్నిహితులైన ప్రవీణ్‌ లింగమనేని, నాగేష్‌ లింగమనేని, శ్రీలక్ష్మి లింగమనేని, డి.శ్రీనివాసరావు, రాధిక ద్రోణవల్లి, గోపిచంద్‌ లింగమనేని, పుష్పలత దివిలను 'ఇన్‌సైడర్లు'గా నిర్ధారించింది. ముందస్తు సమాచారంతో షేర్లు కొనిఅధికారికంగా అది వెలుగులోకి వచ్చాక ఆ షేర్లను విక్రయించి రూ.74.08 లక్షల మేరకు లాభపడినట్లు సెబీ పేర్కొంది. దీనిపై వడ్డీతో కలిసి మొత్తం రూ.96.68 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సెబీ ఇచ్చిన ఆదేశాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు, ఆ తర్వాత తన స్పందన తెలియజేస్తానని దివీస్‌ సీఎఫ్‌ఓ ఎల్‌.కిషోర్‌ బాబు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: