దేశంలో కరోనా వైరస్ నిమిషం నిమిషానికి శరవేగంగా పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది దేశ వ్యాప్తంగా తినడానికి తిండి కూడా లేకుండా విలవిల్లా డుతున్నారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఏకంగా దేశంలో ఉన్న ప్రతి 10 మంది లో 8 మంది ఆదాయం అయితే తగ్గిందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజాగా ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ షికాగో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంయుక్తంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు నిర్వహించిన సర్వేలో లాక్ డౌన్ వల్ల ఎంతో మంది జీవన విధానం మారిపోయిందని.. ఎంతో మంది నిరుపేదలు అయిపోతే మరి కొందరు మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగ జారిపోయారని చెప్పింది.
దేశం మొత్తం మీద 84 శాతం కుటుంబాలు లాక్ డౌన్ సమయంలో ఆదాయం కోల్పోయాయని తాజా అధ్యయనంలో తేలింది. 27 రాష్ట్రాల్లో 6 వేలకుపైగా కుటుంబాలపై ఈ సర్వే జరిగింది. మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది తాము నెలకు సంపాదించే సంపాదనలో రు. 3 వేల నుంచి రు. 11వేల వరకు కోల్పోయారని సర్వే స్పష్టం చేసింది. ఈ లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో చాలా మంది వలస కూలీల్లో కొన్ని కోట్ల మంది నిరుపేదలు అయిపోయారు. వీరిలో చాలా మందికి ప్రతి రోజు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి.
అయితే విచిత్రంగా తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 50–70 శాతం ఆంధ్రప్రదేశ్ లో 60–70 శాతం కుటుంబాల ఆదాయంలో తగ్గుదల ఉందట. మరో విషయం ఏంటంటే యూఎన్ వో లెక్కల ప్రకారం ప్రపంచంలో పేదలు బాగా పెరిగి పోయారని... ఈ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 1990 నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని.... ప్రపంచ జనాభాలో 17 కోట్ల మంది పేదరికంలోకి వెళ్తారని తెలిపింది.