దేశంలో మార్చి నెల నుంచి కరోనా కేసులు బాగా పెరిగిపోవడంతో జనతా కర్ఫ్యూ తర్వాత లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి జనసమూహం ఉన్న అన్ని వ్యవస్థలు మూసివేశారు. అందులో రవాణా వ్యవస్థ ఒకటి. దాంతో ఎక్కడి వారు అక్కడే చిక్కిపోయారు. ఉపాది కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.. దాంతో తమ సొంత రాష్ట్రాలకు నానా తిప్పలు పడుతూ వెళ్లారు. ఈ నేపథ్యంలో వలస కూలీల కష్టాలు దృష్టిలో పెట్టుకొని వారిని తమ స్వస్థలాలకు వెళ్లిపోయేందుకు మోదీ సర్కార్ పమిరిషన్ ఇచ్చింది. అంతే కాదు శ్రామిక్ రైళ్ల ఏర్పాటు కూడా చేయడంతో వేల మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కానీ కొన్ని చోట్ల మాత్రం వలస కూలీలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా కరోనా సంక్షోభంలోనూ జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్ఓ) అభివృద్ధి పనులను ప్రారంభించింది. చాలామంది వలస కూలీలు పనులకు వెళ్తూ కష్టకాలంలో ఉపాధి లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘లాక్డౌన్ కారణంగా కలకోటే ప్రాంతంలో 500 నుంచి 600 మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వీరికి ప్రభుత్వం రేషన్తోపాటు అన్నివసతులు కల్పించినా స్వగ్రామాలకు వెళ్లేందుకే ఇష్టపడ్డారు. ఇంతలో ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభమై ఉపాధి లభిస్తుండడంతో సంతోషంతో ఉన్నారు’ అని కలకొటే తాసిల్దార్ అబ్దుల్ ఖయ్యూంఖాన్ తెలిపారు.
ఇక్కడ ఉన్నపాత వంతెన గతవారం కూలిపోవడంతో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కూలీల సాయంతో నిర్మాణం చేపట్టింది. దాదాపు పనులు ముగింపు దశకు చేరాయి. ఇంకో ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల్లో కూలీలు పాల్పంచుకుంటున్నారు. కాగా, కలకొటే ప్రాంతంలోని 10గ్రామాలను కలిపే ఓ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిత్యం 120నుంచి 130మంది పని చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 21లోగా ఇక్కడ పనులు పూర్తి చేస్తామని సైట్ ఇన్చార్జిగా పని చేసే శంషేర్ సింగ్ చౌదరి పేర్కొన్నారు. ఈ రహదారి రాజౌరీ-బుద్హాల్ ప్రాంతాలను కలుపుతుందని ఇక్కడా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.