కర్ణాటకలో మళ్లీ రాజకీయ కుంపట్లు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లకు సమ్మతించని యాడ్యురప్పపై అసమ్మతి జెండా ఎగురవేసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు రహాస్యంగా భేటీ కావడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పదవీ బాధ్యతలు స్వీకరించిన్పటి నుంచి బీజేపీలో అంతర్గత ముసలం కొనసాగుతోంది. ఆశించిన పదవులు దక్కకపోవడంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే అధిష్టానం బుజ్జగింపులతో కొంతమంది..యాడ్యురప్ప స్వీయ హామీలతో మరికొంతమంది ఇన్నాళ్లు ఆగుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు విషయం ముదిరి పాకాన పడింది. అసలు విషయం తెగేదాకా లాగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీలోని కొందరు ప్రముఖ నేతలు కాఫీనాడు రిసార్టులో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. వీరి రహస్య సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చిక్కమగళూరు తాలూకా ముళ్లయ్యనగిరిలో ఉన్న రిసార్టులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బెంగళూరు కోవిడ్ ఇన్చార్జి ఆర్.అశోక్, ఇతర మంత్రులు సీటీ రవి, జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్పలు పాల్గొన్నారు. అంతేకాకుండా సతీశ్ రెడ్డి, మునిరాజు, కృష్ణప్ప వంటి పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం.
సొంత పార్టీ నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడమేంటని ఈ సమావేశంలో వాపోయారట. పార్టీలో యడ్డి కుమారుడి పాత్ర అతి జోక్యం ఎక్కువ అవుతోందని చర్చకు వచ్చినట్లు సమాచారం. యడియూరప్పకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే తాము ఎలాంటి రహస్య సమావేశం ఏర్పాటు చేయలేదని మంత్రి ఆర్.అశోక్ వెల్లడించడం గమనార్హం. కరోనా కాలంలో కర్ణాటక రాజకీయం కొత్త మలుపేమైనా తీసుకుంటుందోనన్నటెన్షన్ బీజేపీ అధినాయకత్వంలో పట్టుకున్నట్లు తెలుస్తోంది.