ప్రపంచానికి 2020 శాపంగా మారింది. ప్రకృతి బీభత్సాలు.. మిడతల గోల.. కరోనా వైరస్. ఓ వైపు ప్రాణాలు పోతున్నాయి.. ఆర్థికంగా భారీగా నష్టాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో మూడో వంతు మరణాలు, కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు అయ్యాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, మెక్సికోలో కరోనా మరణాలు 30 వేలు దాటాయి. దీంతో అత్యధిక మరణాల జాబితాలో ఫ్రాన్స్ను వెనక్కి నెట్టిన మెక్సికో ఐదోస్థానానికి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,80,633కు చేరగా, మరణాలు 5,33,449కి పెరిగాయి.
ఇప్పటివరకు ఈ వైరస్ భారినపడినవారిలో 64,39,666 మంది కోలుకోగా, 44,07,518 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మొత్తం నమోదైన కేసుల్లో కోలుకున్నవారి శాతం 92గా ఉండగా, మరణించేవారి సంఖ్య 8 శాతంగా ఉన్నది. అమెరికా తర్వాత అత్యధిక కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో కరోనా కేసుల సంఖ్య 15,78,376కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 64,365 మంది మరణించారు. ఈ లాటిన్అమెరికా దేశంలో నిన్న 37,923 పాజిటివ్ కేసులు నమోదవగా, 1091 మంది చనిపోయారు. ఈ రెండు దేశాల తర్వాత రష్యాలో 6,74,515 పాజిటివ్ కేసులు నమోదవగా, 10,027 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,904కు చేరింది.
దేశంలో ఇప్పటివరకు 19,279 మంది బాధితులు మరణించారు. కాకపోతే భారత్ లో రికవరీ శాతం బాగా ఉందని.. అది ఊరట ఇచ్చే విషయం అంటున్నారు. ఈ దేశాల తర్వాత పెరూలో 2,99,080 మంది కరోనా బారినపడగా, 10,412 బాధితులు చనిపోయారు. స్పెయిన్లో ఇప్పటివరకు 2,97,625 పాజిటివ్ కేసులు నమోదవగా, 28,385 మంది మృతిచెందారు. ఏడో స్థానంలో ఉన్న చిలీలో మొత్తం 2,91,847 మందికి కరోనా సోకగా, వైరస్ వల్ల 6192 మంది బాధితులు మరణించారు. మరోవైపు యూకేలో కరోనా కేసులు సంఖ్య 2,84,900కు చేరింది. ఇప్పటివరకు 44,198 మంది కన్నుమూశారు.