ఇప్పుడు అందరి చూపు కరోనా వ్యాక్సిన్పైనే. ఈ మహమ్మారికి బ్రేక్ వేసేలా వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో, కొవిడ్-19కు దేశీయ టీకా ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని ఐసీఎంఆర్ ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుందని వెల్లడించింది. అయితే, ఐసీఎంఆర్ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఇంకా హ్యూమన్ ట్రయల్సే మొదలుకాకుండా టీకాకు డెడ్లైన్ ఎలా విధిస్తారని ఫార్మా కంపెనీలు, వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆదేశాలపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఘాటుగా స్పందించాయి. ఐసీఎంఆర్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టి మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ కాస్త రాజకీయ విమర్శలకు చిరునామాగా మారింది.
ఐసీఎంఆర్ ఆదేశాల నేపథ్యంలో ఏదైనా వ్యాధికి నిర్ణీత వ్యవధిలో వ్యాక్సిన్ తయారీ ఎలా సాధ్యమవుతుందని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘ఎంత సమర్థంగా పనిచేసినా ఫాస్ట్ట్రాక్ విధానంలో కేవలం నాలుగు వారాల్లో భద్రత, రోగ నిరోధకత, సమర్థత పరంగా మెరుగైన వాక్సిన్ తయారుచేయటం సాధ్యం కానేకాదు’ అని వెల్కం ట్రస్ట్ సీఈవో, ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ తేల్చిచెప్పారు. మరో వైరాలజిస్టు ఉపాసనా రాయ్ స్పందిస్తూ కరోనా వైరస్కు వ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నాలను అభినందించాల్సిందేనని, కానీ అందుకోసం డెడ్లైన్లు పెట్టుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు.
కాగా, తమ డెడ్లైన్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఐసీఎంఆర్ స్పందించింది. దేశంలో వైరస్ విజృంభన నేపథ్యంలో వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారిక అడ్డంకులు ఎదురుకాకుండా ఫాస్ట్ట్రాక్ విధానం అమలు చేసేందుకే డెడ్లైన్ విధించినట్టు వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘కొవాగ్జిన్' క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఐసీఎంఆర్ పేర్కొన్నది. కొవాగ్జిన్ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని వెల్లడించింది. త్వరలో హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది.