ప్రపంచంలో కొన్ని సంఘటనలు జీవిత కాలం గుర్తుండిపోతుంటాయి. అది సంతోషమైనా.. విషాదమైనా.  అమెరికాలో సెప్టెంబరు 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి గురించి తల్చుకుంటే ఇప్పటికీ అక్కడ కొంత మంది ప్రజలకు వెన్నుల్లో వణుకు పుడుతుంది.  పేకమేడలా కూలిపోయిన అతి పెద్ద భవనాలు.. వాటిలో ఆర్తనాదాలు చేస్తూ చనిపోయిన సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కన్నీరు ఆగదు.  ప్రతి సంవత్సరం వాళ్లకు ఘన నివాళులు అర్పిస్తుంటారు. అయితే 9/11 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ తీసిన ఓ ఫొటో అప్పట్లో వైరల్ అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. స్టీఫెన్ కూపర్ మాత్రం ప్రాణాలకు తెగించిన ఫోటోలు తీశారు. ఆ ఫొటోలో వెనక దట్టంగా అలముకున్న పొగ, శిథిలాలు కనిపిస్తుండగా, ముందు పరుగులు తీస్తున్న వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది.  

 

అప్పటి సంఘటనలు అద్దం పట్టే విధంగా ఆయన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కూపర్  న్యూయార్క్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఫ్లోరిడాలోని డెల్రే బీచ్‌లో నివసిస్తుంటాడు. మార్చి 28న అతడు డెల్రే మెడికల్ సెంటర్‌లో కరోనాతో ప్రాణాలు విడిచినట్టు ‘పామ్ బీచ్ పోస్ట్’ తెలిపింది. అతడి వయసు 78 సంవత్సరాలని తెలిపింది. అసోసియేటెడ్ ప్రెస్ ఫొటో ప్రెస్ ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లలో ప్రచురితమైంది. న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్ మ్యూజియంలోనూ ఇదే ఫొటో ఉంది.  ఘటన జరిగిన రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో వద్ద డాక్యుమెంట్ల డెలివరీ పనిలో ఉన్నాడని, ఉగ్ర ఘటన గురించి అతడికి తెలియకున్నా.. ‘పరిగెత్తండి’ అన్న పోలీసుల అరుపులతో అతడు పరిగెట్టినట్టు పేర్కొన్నారు.

 

ఎడమ చేతితో ఎన్వలప్ కవర్ పట్టుకున్న కూపర్‌తోపాటు మరికొందరు పరుగులు తీయడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. నిజానికి తన ఫొటో తీసిన విషయం కూపర్‌కు తెలియదని 33 ఏళ్లుగా జీవిత భాగస్వామిగా ఉన్న జానెట్ రాషెస్ పేర్కొన్నారు. ఒకరోజు అతడు మ్యాగజైన్‌పై ఉన్న తన ఫొటోను చూస్తూ.. ‘ఓ మై గాడ్.. అది నేనే’ అంటూ ఆశ్చర్యపోయాడని ఆమె వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: