వైసీపీ అధినేత జగన్కు తలనొప్పిగా మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని జగన్ ఓ కొలిక్కి తెచ్చినట్టే కనపడుతోంది. అసలు ఏ పార్టీ పట్టించుకోని సమయంలో పిలిచి ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు పలు పార్లమెంటరీ స్థాయి పదవుల్లో ఆయన్ను సభ్యుడిగా నియమించేలా జగన్ లేఖలు ఇచ్చారు. తాము ఇంత చేస్తే రఘు తమను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడంతో వైసీపీ అధిష్టానం, వైసీపీ కీలక నేతలు పలు సార్లు ఎదురు చూసి విసిగి పోయారు. చివరకు ఈ విషయాన్ని అంత సులువుగా వదిలి పెట్టకూడదని జగన్ భావించారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయనపై ఎంపీగా వేటు వేయాలని స్పీకర్ను కోరిన వైసీపీ ఎంపీల బృందం ఇప్పుడు ఆయనకు తమ సిఫార్సుల ద్వారా వచ్చిన అన్ని పదవులు క్యాన్సిల్ చేయాలని కూడా కోరింది. ఇక ఇప్పుడు ఈ పదవులు అన్ని కూడా జగన్కు సన్నిహితుడు అయిన కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఇవ్వాలని కూడా స్పీకర్ను కోరారు. బాలశౌరి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు.
ఆయన 2004లో నే కాంగ్రెస్ నుంచి తెనాలి నుంచి లోక్సభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన 2009లో నరసారావుపేటలోనూ, 2014లో గుంటూరు నుంచి ఎంపీగా ను పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు ఢిల్లీ వర్గాల్లోనూ మంచి పట్టుంది. పార్టీ తరఫున కీలక ఎంపీల్లో ఒకరైన బౌలశౌరి ప్రస్తుతం ఇతర పార్లమెంటరీ కమిటీ పదవుల్లోనూ కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు రఘు రామకృష్ణం రాజు ఏ పదవుల్లో అయితే కొనసాగుతున్నారో ? ఆ పదవులు అన్నింటిలోనూ బాలశౌరిని నియమించాలని వైసీపీ ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాను కోరాగా ఆయన కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.