రెండు రోజుల క్రితం ఓ వార్త బాగా చక్కర్లు కొట్టేసింది.. ఓ ఇండియన్ కంపెనీ ఆగస్ట్ లో కరోనాకు వ్యాక్సీన్ అందుబాటులోకి తీసుకొస్తోంది అని ప్రకటించింది. ఐసీఎంఆర్ తో కలసి పని చేస్తుండటంతో ఆ వార్తకు మంచి ఫోకస్ లభించింది. అందులోనూ ప్రపంచమంతా కరోనా వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తుండటంతో అంతా భలే గుడ్ న్యూస్ అనుకున్నారు.
కానీ.. ఆరువారాల్లోనే వ్యాక్సీన్ రావడం కుదరందంటున్నారు నిపుణులు. ఐసీఎంఆర్ ప్రకటించినట్లు ఆరు వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్సింగ్ గులేరియా ప్రకటించారు. ఎందుకంటే.. అసలు మనుషులపై ప్రయోగాలు నిర్వహిస్తే.. దాన్ని నిర్ధారించు కోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందట.
ఆయన ఇంకా ఏమంటున్నారంటే.. " భారత్లో చాలా కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో తలమునకలయ్యాయి. అందులో భారత్ బయోటెక్తో పాటు సీరం ఇన్స్టిట్యూట్, క్యాడిలా లాంటి సంస్థలు ఉన్నాయి. వ్యాక్సిన్ అభివృద్ధిలో చాలా దశలు ఉంటాయి. ప్రస్తుతం భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ను తొలుత మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుందా? లేదా? అన్నది చూడాలి. దీనికి కొన్ని వారాలు పడుతుందని చెబుతున్నారు.
అంతే కాదు.. ఆ తర్వాత వ్యాక్సిన్ భద్రత గురించి మదింపు చేయాలట. లక్షలాది మందికి దాన్ని ఇస్తారు కాబట్టి భద్రత అతి ముఖ్యమని ఆయన అంటున్నారు. అది పూర్తిగా సేఫ్ అని 70-80% మేర నిలకడైన రోగ నిరోధక శక్తిని ఇస్తుందని పూర్తిగా అంచనాకు వచ్చాకే మార్కెట్లోకి తీసుకురావాలని చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా ఆరువారాల్లో పూర్తి కావడం చాలా కష్టమని ఆయన అంటున్నారు. అంటే ఆగస్టులో వ్యాక్సీన్ కష్టమే అన్నమాట.