హైదరాబాద్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు టెస్టుల సంఖ్య విషయంలో అస్పష్టత ఉన్నప్పటికీ మరోవైపు చేస్తున్న పరీక్షల్లో కూడా భారీగా కేసులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంగళవారం సమీక్ష జరపనున్నట్లు గవర్నర్ తమిళిసై సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ మేరకు చర్చలు నిర్వహించారు. అయితే, గవర్నర్ సోషల్ మీడియా పోస్ట్కు ఊహించని ప్రతిపాదన వచ్చింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో గవర్నర్ తమిళ సై వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 11 ప్రయివేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ తమిళ సై ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు తేల్చి చెప్పారు. అంతేకాదు.. నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని గవర్నర్ స్పష్టం చేశారు. కరోనా కల్లోలంతో భయాందోళనలు పెరిగిపోతున్న దృష్ట్యా అనేక కారణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల పట్ల బాధ్యతగా.. మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందుతలేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. కార్పొరేట్ హాస్పిటల్స్ కు వచ్చే పాజిటివ్ రోగులకు భరోసా కల్పించాలన్నారు. పాజిటివ్ బాధితులు హాస్పిటల్స్ రాగానే కచ్చితంగా చేర్చుకోవాలని, నాలుగైదు హాస్పిటల్స్ తిరిగే పరిస్థితి రాకూడదని గవర్నర్ హెచ్చరించారు. అలాగే టెస్టులు బాధ్యతతో చేయాలని.. అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్స్ కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల సహకారం తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషేంట్స్ నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.
కాగా, ఈ సమావేశానికి ముందు గవర్నర్ చేసిన ప్రకటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉందని, లాక్ డౌన్ విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఓ నెటిజన్ గవర్నర్ను కోరారు. కరోనా వ్యాప్తి, పరీక్షలు, ట్రీట్మెంట్ విషయంలో చొరవ చూపాలని మరో నెటిజన్ కోరారు. దీనికి స్పందించిన గవర్నర్ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయని మరో నెటిజన్ తెలిపారు. హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కోరారు. రాష్ట్రంలో రోజుకు ఐదారువేల పరీక్షలే జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని గవర్నర్ ను పలువురు నెటిజన్లు కోరారు.