అనేక సమ్వత్సరాలుగా ఉమ్మడి రాష్టం లో పాలనా అందించినటువంటి సెక్రెటరైట్ ను అర్ధరాత్రి నుండే సైలెంట్ గా చుట్టూ పక్కల అన్ని రోడ్లను మూసేసి ప్రజల రాకపోకలను నియంత్రించి యుద్ధ ప్రాతిపదికన సీక్రెట్గా కూల్చడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలంతా కరోనాతో ఇబ్బందుల్లో ఉంటే ఆగమేఘాల మీద సచివాలయాన్ని కూల్చివేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమొచ్చిందని భట్టి ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ధ్వంసం చేస్తే కెసిఆర్ను రాష్ట్ర ప్రజలు క్షమించరు అంటూ తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమైందని, ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త నిర్మాణం పేరుతో ప్రభుత్వం సచివాలయం కూల్చివేతకు పూనుకుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారో బయటకొచ్చి ప్రజలకు వాస్తవాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకుంటున్నారని అన్నారు.బతికుంటే బలుసాకు తినొచ్చు అని చెప్పిన మీరు ఆ రకంగా అందరిని బతికించడానికి మన దగ్గరున్న వనరులు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. ఓ పక్క ఊపిరాడక ప్రజలు చనిపోతున్నారు, మరోవైపు పేషెంట్లనీ చూడడానికి సరిపోను వైద్యులు లేక, హాస్పిటళ్లలో సరైన వసతులు లేక, పారా మెడికల్ సిబ్బంది లేక, డాక్టర్లకు నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వకుండా, హాస్పిటళ్లలో బెడ్లు కాళీ లేక ఎప్పుడు ఏమైతుందో తెలియక ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు.
ప్రధానంగా రాష్టం లో బీపీఎల్ కుటుంబాలకు కానీ, ఉద్యోగాలు లెక్క ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువత కానీ, సగం జీతాలు పొందుతున్న ఉద్యోగస్తులకు కానీ, పెన్షన్లు రక ఇబ్బంది పడుతున్న పెన్షనర్లు కానీ, చిరువ్యాపారస్థులు కానీ , రోజువారీ కూలీలు కానీ, పేద ప్రజలు కానీ, వీళ్లందరినీ ఆదుకోవడానికి సాధ్యమైనంతవరకు మన దగ్గరున్న అన్ని వనరులన్నీ ఉపయోగించాల్సి ఉందని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి యుద్ధ ప్రాతిపదికన సెక్రటేరియట్ ను కూల్చడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రశ్నించారు. ఇదిలా ఉండగా బుధవారం పెద్ద ఎత్తున ఆందోలన కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.