దేశంలో ఈ దిక్కుమాలిన కరోనా ఏమంట మొదలైందో కానీ.. బతికున్నవారు రక్త సంబంధాలను సైతం తెంచుకోవాల్సిన పరిస్థితిని కరోనా సృష్టించింది. ఒకప్పటితో పోల్చుకుంటే నేటి కాలం కుటుంబ బంధాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ కరోనా వల్ల అది పూర్తిగా ముదిరి పాకాన పడ్డట్టవుతుంది. భౌతిక దూరం కాస్తా సామాజిక దూరమై మనుషుల నుంచి మనుషులను వెలేస్తోంది. ఓ భర్త కూడా కరోనా భయంతో తన భార్యను ఇంటికి రానివ్వలేదు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన కరోనా దాష్టీకానికి అద్దం పడుతోంది. దాంతో ఆ భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. మూడు నెలల కిందట చండీఘర్కు వెళ్లింది.
ఇంతలో లాక్డౌన్ విధించడంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఆమె భర్త, పదేళ్ల కుమారుడు మాత్రం బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ మద్య లాక్ డౌన్ సడలించడంతో తన భర్త, కుమారుడి వద్దకు వచ్చింది. తనని చూసి భర్తాకొడుకు ఎంతగా మురిసిపోతారు అంటూ తెగ ఆనందంతో ఇంట్లోకి అడుగు పెట్టపోయింది.. కానీ భర్త ఇచ్చిన షాక్ కి దిమ్మతిరిగిపోయింది. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని చెప్పాడు. కరోనా రిపోర్టు నెగిటివ్ వస్తేనే ఇంట్లోకి అనుమతిస్తానని భార్యకు తెగేసి చెప్పాడు. దీంతో ఆమె మరింత షాక్ అయింది.
తన ఆరోగ్యం బాగుందని.. ఎలాంటి కరోనా పాజిటీవ్ లేదని ఎంత చెప్పినా భర్త మాత్రం ససేమిరా అన్నాడు. వెళ్లాల్సిందే.. క్వారంటైన్ పూర్తి చేసుకుని రావాల్సిందే అని గట్టిగా ఆజ్ఞాపించాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను పిలిపించి.. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. కరోనాపై వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్ను భర్తతో పాలు పంచుకుంటోంది.