దేశంలో కరోనా ఎప్పుడైతే వచ్చిందో మనిషిని మనిషి చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. తుమ్మినా.. దగ్గినా అతను ఓ పెద్ద నేరం చేసిన వారిలా కోపంగా చూస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మంటగలుపుతూ.. మనుషులను మట్టి కరిపిస్తోంది. ఇప్పటికే కలియుగంలో సంబంధ బాంధవ్యాలు పూర్తిగా సమసిపోతున్నాయన్న తరుణంలో ఈ కరోనాతో మొత్తం కుటుంబాలకు దూరమవుతున్నారు. ఇప్పటికే కరోనాకు ఎంతోమంది బలయ్యారు. ఇక బతికున్నవారు రక్త సంబంధాలను సైతం తెంచుకోవాల్సిన పరిస్థితిని కరోనా సృష్టించింది. ఇప్పటికే మనుషులు బంధుత్వాలను తెంచుకుంటుంటే.. ఈ కరోనాతో అది ఇంకా తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి.
కరోనా సోకినవారిని ముట్టుకోవద్దని వైద్యులు చెప్పారు. ఆ ఒక్క మాట ఎన్నో అమానవీయ సంఘటనలకు కారకురాలైంది. తాజాగా సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి హెల్త్ వర్కర్లకు చుక్కలు చూపించిన సంఘటన కేరళలో జరిగింది. పాతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గత కొంత కాలంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నివసిస్తున్నాడు. గత మూడు రోజులుగా క్వారంటైన్ లో ఉన్నారు. ఇంతలోనే భార్యతో విభేదం రావడంతో ఇంట్లో నుంచి బయటకొచ్చేశాడు. బైక్ పై పాతనంతిట్టకి బయల్దేరాడు. పాతనంతిట్టకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఇతనిని ఆపారు. మాస్క్ ధరించకుండా బైక్ పై వెళుతున్నవెంటని ఆరా తీయగా.. తానూ ఈ మధ్యే రియాద్ నుంచి వచ్చినట్టు చెప్పాడు.
ఈ సమాచారాన్ని హెల్త్ వర్కర్లకు అందించారు. వారు పీపీఈ కిట్లు ధరించి అంబులెన్స్తో అతను ఉన్న ప్రాంతానికి వచ్చారు. తాను చచ్చినా క్వారంటైన్కు వెళ్లేందుకు మొండికి వేశాడు. వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తానికి నానా తంటాలు పడి పీపీఈ కిట్లు ధరించిన హెల్త్ వర్కర్లు నానా పాట్లు పడి ఎట్టకేలకు అతనిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు.