తన స్థావరాన్ని పోలీసులు తెలుసుకొని వస్తున్నారని ముందుగానే పసిగట్టి వారిపై అత్యంత ఘోరంగా కాల్పులు జరిపించి చంపాడు. 8 మంది పోలీసులను హతమార్చిన తర్వాత తప్పించుకు తిరుగుతున్న దూబే.. ఫరీదాబాద్లోని బద్కల్ చౌక్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో దాక్కున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం దూబేను పట్టుకునేందుకు హోటల్పై దాడిచేసింది. అయితే, అప్పటికే అతను హోటల్ నుంచి తప్పించుకున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రికార్డు ఉన్న అతని కోసం యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వికాశ్ దూబేపై ఉన్న రివార్డును 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించారు. కాన్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో వికాశ్ దూబే ప్రధాన నిందితుడు.
హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఓ హోటల్లో వికాశ్ దూబే కనిపించినట్లు తెలుస్తోంది. హోటల్పై రెయిడ్కు వెళ్లిన పోలీసులు అక్కడ ఎన్కౌంటర్ జరిపారు. ఆ హోటల్లో ఉన్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మరోసారి పోలీసులు వస్తున్నట్లుగా ముందుగానే పసిగట్టిన దుబే మరోసారి అత్యంత చాకచాక్యంగా తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో వికాశ్ దూబే మాస్క్ వేసుకుని ఆ హోటల్కు వచ్చినట్లు సీసీటీవీ ఫూటేజ్లో తేల్చారు. యూపీ పోలీసు విభాగానికి చెందిన 25 దళాలు దూబే కోసం వేట కొనసాగిస్తున్నాయి. యూపీ పోలీసులు ఇవాళ వికాస్ దూబే ప్రధాన సహాయకుడు అమర్ దూబేని ఎన్కౌంటర్ చేశారు.
హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్లో ఈ రోజు ఉదయం అమర్ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపారు. కాన్పూర్ లో పోలీసులను అత్యంత పాశవికంగా చంపండం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సైతం సీరియస్ గా ఉన్నారు. కాగా, హోటల్ యజమానితోపాటు సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులను సీజ్ చేసి అతడి మకాం గురించి ఆరా తీస్తున్నారు. కాగా, గ్యాంగ్స్టర్ కోసం ప్రత్యేక బృందాలు వంద ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.