ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది నేడు 71వ జయంతి. ఈ సందర్భంగా ఇప్పటికే వైఎస్ తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని కూడా సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవన్నీ పక్కన పెడితే.. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుతం ఆ మహానుభావుడు మన మధ్య లేకపోయినా.. ఆయన మార్కు జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉన్నాయి.
ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన వైఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1978లో జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల వెంటనే మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా.. ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఇక 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు.
అయితే 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. ఈ నేపథ్యంలోనే 2003 మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో `వ్యవసాయానికి ఉచిత విద్యుత్` ప్రచారం వైఎస్ విజయానికి బాటలు వేసింది అనడంలో ఎలాంటి సందేమం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలైన ఈ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. దీంతో 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో వైఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించారు.