వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీఆర్‌ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా ఖ్యాతిగాంచారు. కేవలం ఆరేళ్ల పాలనతోనే అఖండ జనాదరణ పొందారు. తనదైన ముద్ర వేశారు. అలాంటి వైఎస్‌ హఠాత్తుగా.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే ఆయన హఠాన్మరణంపై ఇప్పటికీ అనేక మందికి అనుమానాలు ఉన్నాయంటారు. 

 

 

కొన్నేళ్ల క్రితం వైఎస్‌ హెలికాప్టర్ ప్రమాదానికి రిలయన్స్ అధిపతులు కుట్రపన్నారంటూ.. ఓ రష్యన్ పత్రిక ప్రచురించిన కథనంపైనా వివాదం రేగింది. ఆ తర్వాత ఆ పత్రిక ఆ కథనాన్ని ఉపసంహరించుకుంది కూడా. అయితే అసలు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది.. హెలికాప్టర్ ఎలా ప్రమాదానికి గురైంది.. ఇలాంటి విషయాలను వివరించే కాక్ పిట్ రికార్డర్ ఏం చెప్పింది.. అనేది ఆసక్తికరం. 

 

 


హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో ఇలాంటి కాక్ పిట్ వాయిస్ రికార్డర్లే అసలు గుట్టు విప్పుతాయి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ కాక్‌ఫీట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణను ఆ తరువాత అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి సేకరించిన హెలికాప్టర్ శకలాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఢిల్లీకి తరలించారు. వాటిని డీజీసీఏ అధికారులు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను విశ్లేషించారు. 

 

 


ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. ఏటీసీ పరిధిలో ఎగురుతోంది. ప్రమాదం జరిగిన 9.22 నిమిషాల నుంచి 9.30 వరకు హెలికాప్టర్ పైలెట్లు తమకు దారి కనిపించడం లేదని, సరైన దారి చూపించమని పదేపదే చెన్నై ఏటీసీ అధికారులను బతిమాలుకున్నట్లు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ ద్వారా వెల్లడైనట్లు కొంతమంది అధికారులు మీడియాకు తెలిపారు. సరిగ్గా 9.30 గంటల తర్వాత సంభాషణ ఆగిపోయినట్లుగా సమాచారం. వై.ఎస్. హెలికాప్టర్ ప్రమాదంపై కేసును చట్టపరంగా సీబీసీఐడీ దర్యాప్తు చేసింది. చివరకు వైఎస్ మరణం హెలికాప్టర్ ప్రమాదం కారణంగానే జరిగిందని తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: