తొలిసారి ఎన్నికల బరిలో దిగి...టీడీపీ సీనియర్ నేతలని మట్టికరిపించిన యువ సంచలనాలు వైసీపీలో చాలామంది ఉన్నారు. అయితే గెలిచాక కూడా తమదైన శైలిలో దూసుకుపోతూ...ఒక ఏడాదిలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు. అలా తొలిసారి గెలిచి క్రేజ్ సంపాదించుకున్న ఎమ్మెల్యేల్లో చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ముందు వరుసలో ఉన్నారు.

 

2019 ఎన్నికల్లో రజిని...టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుని చిత్తుగా ఓడించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఏడాది సమయంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇంత క్రేజ్ తెచ్చుకున్న రజినికి వైసీపీ అధిష్టానం సపోర్ట్ కూడా ఫుల్‌గా ఉందట. త్వరలోనే ఆమెకు మంత్రి పదవి ఖాయమైందనే ప్రచారం నడుస్తోంది. ఇక రజిని ఈ విధంగా క్రేజ్ తెచ్చుకోవడం వల్లే వైసీపీ అధిష్టానం కూడా గట్టి మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 

అందుకే ఆమెతో కాస్త విభేదాలు ఉన్న నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుని సైతం, అధిష్టానం సైడ్ చేస్తున్నట్లు సమాచారం. గత కొన్ని నెలల నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణకు, ఎమ్మెల్యే రజినికి పెద్దగా పొసగని సంగతి తెలిసిందే. ఎంపీ చిలకలూరిపేట వచ్చిన ప్రతిసారి, రజని వర్గం ఆయన్ని ఏదొరకంగా అడ్డుకోవాలని చూస్తోంది. శ్రీకృష్ణ, సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు సపోర్ట్‌గా ఉండటంతో, రజిని వర్గం రగిలిపోతుంది. ఎక్కడ తమ ఆధిపత్యం తగ్గిపోతుందనే భయంలో శ్రీకృష్ణకు అడ్డు తగులుతున్నారు.

 

చిలకలూరిపేట కూడా నరసారావుపేట పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. అయినా సరే రజిని వర్గం శ్రీకృష్ణని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వడం లేదు. అనధికారిక కార్యక్రమాలకు వస్తున్నా సరే, ఏదొక అడ్డంకి సృష్టిస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో రజిని వర్గం తప్పు ఉందని స్పష్టంగా అర్ధమవుతున్నా, రజినికు ఉన్న క్రేజ్‌తో వైసీపీ అధిష్టానం ఆమెకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎంపీ శ్రీకృష్ణని సైడ్ చేసేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: