మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన త్వరగా రోగాల బారిన పడతారు. అంతే కాకుండా మానవునిలో విటమిన్స్ లోపం వలన కూడా శక్తి అనేది తగ్గిపోతుంది. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే పలు వైరస్లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
మనిషికి విటమిన్ డి చాల అవసరం. అయితే ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి విటమిన్-డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. ఏసీ, చీకటి గదుల్లో గడిపేస్తున్నవారే ఎక్కువ. దాంతో చాలామందిలో ఇప్పుడు విటమిన్ డి లోపం కనిపిస్తోంది. క్యాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్ అవసరం. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. వాపులను తగ్గిస్తుందని కొన్ని ప్రయోగ పరిశోధనలు తెలుపుతున్నాయి.
రోగకారక క్రిములతో పోరాడే టీ-కణాలు, రోగనిరోధక కణాల పనితీరును విటమిన్-డి మెరుగుపరుస్తుందన్నారు. గుండె జబ్బులను తగ్గిస్తుందన్నారు. బరువు నియంత్రణకు సాయపడుతుంది. కాలేయం, చేపలు, తోటకూర, మునగాకు, మొక్కజొన్న, రాగులు, సోయా, రాజ్మా, బొబ్బర్లు, బీన్స్, టమాట, దానిమ్మ, రెజిన్స్, బొప్పాయి, లవంగాలు, యాలకులు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలియజేశారు.
అయితే విటమిన్-డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్నారుల్లో రికెట్సతో పాటు, శ్వాసకోస సంబంధ సమస్యలూ ఎదురవుతాయి. పెద్దల్లో దగ్గు, జలుబు, కారణం లేకుండా వచ్చే ఒళ్లునొప్పులు వంటివీ కనిపిస్తాయన్నారు. వీటితో పాటు మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు.
గర్భిణుల్లో లోపిస్తే మధుమేహం వంటి సమస్య ముప్పుతో పాటు పాపాయి తక్కువ బరువుతో పుట్టొచ్చునన్నారు. ఎదుగుదలలో లోపాలు ఉండొచ్చునని నిపుణులు పేర్కొన్నారు. చేపలు, చేప నూనెలు, గుడ్డుపచ్చసొన, చీజ్, కాలేయం, చికెన్, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, ఫార్టీఫైడ్ నూనెలు, చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వుల నుంచి విటమిన్-డి అందుతుంది.