భారత దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతున్నది. ఫలనా రాష్ట్రం అనే తేడా లేకుండా, పేరుతో సంబంధం లేకుండా...కేసుల మోత మోగిపోతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 475 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,604కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,76,685 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
వైరస్ బారినవారిలో 4,95,513 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 2,30,599 పాజిటివ్ కేసులు నమోదవగా, 9667 మంది మరణించారు. తమిళనాడులో 1,26,581 మంది కరోనా బారినపడగా, 1,765 మంది బాధితులు మృతిచెందారు. దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 1,07,051 కేసులు నమోదవగా, 3258 మంది చనిపోయారు. 39194 పాజిటివ్ కేసులతో గుజరాత్, 32,362 కరోనా కేసులతో ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
కాగా, మహారాష్ర్టలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగానే నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ర్ట పోలీసులను ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. మహారాష్ర్ట వ్యాప్తంగా 5,935 మంది పోలీసులకు కరోనా సోకింది. గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గురు పోలీసులు కరోనాతో ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు 74 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ర్టలో ఇప్పటి వరకు 2,30,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,667 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 93,654 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.