భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మార్చి నెలలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. నిన్న ఆదివారం ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 2,30,000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. అమెరికాలోనే అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో అత్యధికంగా 1,42,992 కేసులు నమోదు అయ్యాయి. అమెరికా తర్వాత స్థానంలో దక్షిణ ఆసియా ఉన్నది. ఇక వైరస్ మరణాల్లో ఇటలీ దేశాన్ని మెక్సికో దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా వైరస్ వల్ల 5,285 మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నది మహారాష్ట్రలో ఆ తర్వాత తమిళనాడు లో కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి సంబంధించి ముంబైలో అత్యంత ఘోరమైన పరిస్థితి ఉందని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే రాష్ట్రంలోని థానే జిల్లా మన దేశంలోనే అతిపెద్ద కరోనా హాట్స్పాట్గా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ కేసులు కొన్ని రోజులు నుంచి ఎక్కువగా పెరిగిపోతున్నాయి.
జూలై ప్రారంభం నుంచి ఆర్థిక రాజధాని ముంబైకి పక్కనే ఉన్న థానే జిల్లా నుంచి గరిష్టంగా కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. జూలైలో థానేలో సగటున ప్రతిరోజూ 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. థానే జిల్లాలో ప్రస్తుతం 57,000 కేసులు ఉన్నాయి. కేసుల పెరుగుదలను గుర్తించిన థానే పరిపాలనా విభాగం జూలై 2 నుంచి 12 వరకు కఠినమైన లాక్డౌన్ అమలు చేసింది. ఇప్పుడు దీనిని జూలై 19 వరకు పొడిగించారు.