ఇప్పటివరకు పలువురు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ పరోక్షంలో ఆయన ముఖ్యమంత్రికుర్చీలో కూర్చోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ లోని రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులందరి తరుపున కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు అంటూ పద్మారావు వ్యాఖ్యానించగా, కేటీఆర్ మౌనం వహించారు.రైల్వే కార్మికులందరి తరపునా కాబోయే ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానని పద్మారావు తెలిపారు. బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్కు శాసనసభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. కేటీఆర్ను ఉద్దేశించి పద్మారావు… కాబోయే సీఎం అని వ్యాఖ్యానించగానే సభా ప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది.
ఒకవేళ గతంలో లాగే సీఎం కేటీఆర్ అనే ప్రచారం ఉట్టిదే అయితే… వెంటనే మైక్ అందుకొని కేటీఆర్ ఖండించే వారు. అలాంటిదేమీ లేదని… అదంతా మీడియా ప్రచారమేనంటూ చేతులు దులుపుకునే వారు. కానీ అలా చేయలేదు. సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాతే తనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేటీఆర్ ను కలిసి వచ్చి, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటో పెట్టాడు.ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న విశ్లేషకులు… మౌనమే అంగీకారమన్న సూత్రం ఇక్కడ వర్తిస్తుందని, కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారని… అవును కేటీఆర్ సీఎం అయితే తప్పేంటీ ఆయనే మా నాయకుడు అంటూ హరీష్ రావుతో కూడా ఓ మాట అనిపించాక, ఈ ప్రచారానికి పట్టాభిషేకంతో ముగింపు పలుకుతారని అభిప్రాయపడుతున్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేటీఆర్ కాకుండా తెలంగాణ ఉద్యమకారుడే సీఎం కావాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఎవరిని చేయాలనేది టీఆర్ఎస్ అంతర్గత సమస్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ను సీఎం చేయాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.