రాజకీయ పార్టీలకు అందిన మొత్తం నిధుల్లో 92% కార్పొరేట్ సంస్థల నుంచే రావడం విశేషం. వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా భారత రాజకీయ పార్టీలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇందుకోసం ఏకంగా కొంతమంది వ్యాపారులకు నామినేటెడ్ పదవులను కేటాయించడం గమనార్హం. రాజ్యసభ సీట్లకు నామినేటెడ్ అయ్యే వారిలో వ్యాపారులుండటం ఇందుకు మంచి ఉదాహరణగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్తో పాటు తెలుగు నాట వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, టీఆర్ ఎస్ పార్టీ, తమిళనాడులో అన్నా డీఎంకే, డీఎంకే, కర్ణాటకలో జేడీయూ, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన, నవనిర్మాణసేన ఇలా దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు అవసరమైన నిధులను కార్పొరేట్ సంస్థలు సమకూర్చుతున్నాయి.
ప్రతిఫలంగా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకా తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకుంటున్నాయనేది ప్రధాన ఆరోపణ.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఎన్నో రుజువులు లభ్యమయ్యాయి కూడా. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం..బీజేపీకి 94%, కాంగ్రెస్కు 82% విరాళాలు(రూ.20,000+) కార్పొరేట్ కంపెనీల నుంచే దక్కాయని తేలింది. కార్పొరేట్ సంస్థల నుంచే ఎక్కువ విరాళాలు అందుకున్న పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్(97%), ఎన్సీపీ(94%) ఉండటం గమనార్హం.