రాజకీయ పార్టీల బలాబలాలు సమంగా ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగురవేసింది. ముత్యంరెడ్డికి ఇక్కడ మంచి పేరు ఉండటం శ్రీనివాసరెడ్డికి బాగా కలిసి వచ్చే అంశమని చెప్పాలి. ఇక బీజేపీ రఘునందన్రావుకు ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తని, టీఆర్ ఎస్ ప్రభుత్వ లోపాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి పరిష్కరించే సామర్థ్యం, తెలివి తేటలున్నా నేతగా కొన్ని వర్గాల్లో బలమైన నమ్మకం ఉంది. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఆయనకు పట్టు ఉందనే చెప్పాలి. ఇక టీఆర్ ఎస్ అభ్యర్థి సుజాతకు పార్టీ బలంతో పాటు భర్త చనిపోయాడు కాబట్టి ఆమెను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందనే సెంటిమెంట్ జనాల్లో వ్యక్తమవుతోంది.
ఆమెకు రెండు అంశాలు అనుకూలంగా ఉంటాయన్నది విశ్లేషకుల అంచనా. మిగతా పార్టీలతో పోల్చితే టీఆర్ ఎస్కే ఎడ్చ్ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గంలో యువత ఓట్లు కీలకం కానున్నాయట. మొత్తం ఓట్లో దాదాపు 10శాతం వీరివే ఉండటం గమనార్హం. నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 20 వేల మేరకు యువత ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితాను బట్టి తెలుస్తోంది. ఇందులో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటు పొందిన వారు 5 వేల మేరకు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు, వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు.