భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆట చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. కరోనా ఎఫెక్ట్తో ఏడు నెలల పాటు బ్యాడ్మింటన్కు దూరమైన తెలుగు తేజం వచ్చే ఏడాది బరిలోకి దిగనుంది. ఆసియా ఓపెన్ ద్వారా తిరిగి బ్యాడ్మింటన్లోకి అడుగుపెట్టడానికి డిసైడ్ అయింది సింధు.
వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ఆసియా ఓపెన్-1.. జనవరి 19 నుంచి 24 వరకు ఆసియా ఓపెన్-2 టోర్నీలు జరగనున్నాయి. మరోవైపు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ హోదాలో ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్ టోర్నీలో నేరుగా బరిలోకి దిగే అవకాశాన్ని స్టార్ షట్లర్ పీవీ సింధు కోల్పోయింది. కరోనా ఎఫెక్ట్ ఏడు నెలలుగా ఎలాంటి పోటీలూ జరగకపోవడంతో బీడబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిబంధనల ప్రకారం.. ఆ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన షట్లర్ సీజన్ ముగింపు టోర్నీ అయిన వరల్డ్ టూర్ ఫైనల్స్లో ర్యాంకింగ్స్తో నిమిత్తం లేకుండా నేరుగా పాల్గొనవచ్చు. అయితే ఈ సారి కొవిడ్-19 కారణంగా గత మార్చి నుంచి ఎలాంటి పోటీలూ జరగలేదు. అంతేకాదు.. ప్రపంచ చాంపియన్షిప్లాంటి మెగా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో ఈసారి డిఫెండింగ్ చాంపియన్లకు ఉన్న ఆ వెసులుబాటును తొలగిస్తున్నట్టు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. మొత్తానికి స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఆసియాఓపెన్ తోనే కోర్టులోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. గంటల కొద్దీ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ తన కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తోంది.