భారత్ ను కరోనా భయం వీడుతోంది అనుకుంటున్న టైమ్ లో.. మరో కల్లోలం చుట్టుముట్టుకోబోతోంది అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా వ్యర్థాలతో వచ్చే అనర్థం భారత్ కు అతి ఎక్కువగా ఉందని తేల్చి చెబుతున్నారు. కరోనా కారణంగా పర్యావరణ పరిశుభ్రత పెరిగిందని, గాలిలో కాలుష్యం తగ్గిందని అనుకుంటున్నాం కానీ.. అంతకంటే ఎక్కువగా కరోనా వ్యర్థాలతో మనకి సమస్యలు చుట్టుముట్టుకోబోతున్నాయట.
జూన్ నుండి సెప్టెంబరు వరకు భారత్ లో కోవిడ్ కారణంగా పెరిగిన బయోమెడికల్ వ్యర్థాల పరిమాణం 18,006 టన్నులుగా తేలింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వివరాలను వెల్లడించింది. కరోనా కేసుల విషయంలో ముందున్న మహారాష్ట్రలోనే ఈ వ్యర్థాలు సైతం ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో నాలుగునెలల్లో 3,587 టన్నుల కోవిడ్ వ్యర్థాలు పోగైనట్టుగా తేలింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, గుజరాత్, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. నెలల వారీగా చూస్తే.. సెప్టెంబరులో అత్యధిక స్థాయిలో కోవిడ్ వ్యర్థాలు నమోదయ్యాయి. ఆ నెలలో కోవిడ్ వ్యర్థాల పరిమాణం 5,500 టన్నులుగా తేల్చారు.
కరోనా వైరస్ నిర్దారణ, చికిత్సల సందర్భాల్లో ఉపయోగించిన పరికరాలు, వస్తువుల తాలూకు వ్యర్థాలను ‘కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్’ ద్వారా సమీకరించి డిస్పోజ్ చేస్తున్నారు. పిపిఇ కిట్లు, మాస్కులు, షూ కవర్లు, గ్లౌజులు, మానవ కణజాలం, డ్రెస్సింగ్ కి వాడిన మెటీరియల్, కాటన్, రక్తం.. ఇంకా శరీరంలోని ద్రవాలతో తడిసిన దుప్పట్లు దిండ్లు, బ్లడ్ బ్యాగులు, నీడిల్స్… వంటివి ఈ వ్యర్థాల్లో ఉన్నాయి.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్చి నెలలో వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇళ్లలో, క్వారంటైన్ కేంద్రాల్లో, హెల్త్ కేర్ సెంటర్లలో, శాంపిల్ కలెక్షన్ కేంద్రాల్లో… ఇలా వ్యర్థాలు పోగయ్యే ప్రదేశాల్లో, వాటిని సమీకరించే ప్రాంతాల్లో…. వాటిని ఎలా పట్టుకోవాలి, ఎలా విడగొట్టాలి, ఎలా డిస్పోజ్ చేయాలి వంటి విషయాల్లో ఈ మార్గదర్శకాలు ఉపకరిస్తాయి.

సాధారణంగా భారత్ లోని చాలా ప్రాంతాల్లో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ సరిగా ఉండటంలేదు. ఇక కరోనా కారణంగా పోగైన వేస్టేజ్ విషయంలో కూడా ఆస్పత్రుల నిర్లక్ష్యంతో అవి మరింత ప్రమాదకరంగా మరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడికల్ వేస్టేజ్ నిర్వహణ సరిగా లేకపోతే అది మరో ఉపద్రవానికి దారి తీస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: