ఆయన ఏకంగా అతి పెద్ద కొండనే ఢీ కొట్టారు. అలా ఇలా కాదు, ఏకంగా న్యాయ వ్యవస్థనే ఇరాకాటం పెట్టేలా తాజాగా అసాధారణమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. మరి జగన్ కి ఈ విషయంలో తప్పనిసరిగా బీజేపీ పెద్దల మద్దతు కావాలి. జగన్ కూడా వారి అండ తనకు కచ్చితంగా ఉంటుందని నమ్ముకునే ఈ రకమైన దూకుడుతనం ప్రదర్శించారు అని కూడా అంటారు.
మరి ఇపుడు చూస్తే సీన్ వేరేగా ఉందని ఢిల్లీ టాక్. నిజానికి జగన్ తలనొప్పులు తీర్చేందుకు బీజేపీకి ఏంటి అవసరం అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. చేసిన దానికి తిరిగి బదులు తీర్చుకునే సీన్ ఇప్పటి బీజేపీ అగ్ర నేతలలో ఉంటే దీర్ఘకాలంగా ఆ పార్టీతో కలసి పనిచేసిన శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఎందుకు తప్పుకుంటాయి. అంటే వన్ సైడ్ లవ్ మాదిరిగా ఇప్పటి బీజేపీ అగ్ర నాయకత్వానిది ఒక వైపు స్నేహం మాత్రమేనన్న మాట.
అందుకే జగన్ విషయంలో రాజకీయంగా తలపండిన నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా ఒకటే మాట అంటున్నారు. జగన్ కి ఇపుడు అర్జంటుగా కేంద్ర సాయం కావాలి. వారి మద్దతు ఉంటేనే ఆయన తాజా సమస్యల నుంచి బయటకు వస్తారు అని. కానీ ఢిల్లీ పెద్దల మద్దతు అనుమానమేనని కూడా ఆయన అంటున్నారు. అంటే సరిగ్గా జగన్ గురిపెట్టిన బాణం టార్గెట్ ని రీచ్ కావాలంటే కేంద్ర పెద్దలు ఆయనకు సహకరించాలి. కానీ వారు ఎందుకు ముందుకు వస్తారు అన్నదే ఉండవల్లి లాంటి వారి పాయింట్. చూడాలి మరి ఏం జరుగుతుందో.