కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్‌షా కు లేఖ ఏపీ సిఎం వైఎస్ జగన్ లేఖ రాసారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, అందువల్ల ఆదుకునేందుకు వెంటనే రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని జగన్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయని అన్నారు. ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదు అయిందని చెప్పారు.

అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసిందని అన్నారు. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పొటెత్తిందని చెప్పారు. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించామని ఆయన వివరించారు.

వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైందని ఆయన చెప్పారు. గత ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగిందని అన్నారు. వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి అని లేఖలో వివరించారు. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయని అన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిలిచిందని అన్నారు. ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారని పేర్కొన్నారు.  ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని అన్నారు.  అదే విధంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: