ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు ఎన్ని రకాల మాయోపాయాలు చేసినా వ్యూహాలు పన్నినా ఎపుడూ వైసీపీ అదరలేదు, బెదరలేదు. జగన్ దేన్ని కేర్ చేసేవారు కాదు, లేకపోతే పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన తరువాత కూడా జగన్ ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు. గత పదకొండేళ్ల జగన్ రాజకీయ జీవితంలో బాబుని ఎపుడూ కూడా గట్టి ప్రత్యర్ధిగా భావించలేదు. సరే చంద్రబాబు కూడా జగన్ని గత ఎన్నికల్లో లైట్ గా తీసుకుని ఎటువంటి ఫలితాలు కోరి తెచ్చుకున్నారో కూడా అంతా చూశారు.
ఇపుడు ఇలా ఉంటే జగన్ ఏపీలో తీసుకున్న ఒక అసాధారణమైన నిర్ణయం ఇపుడు వైసీపీని తెగ కంగారు పెడుతోంది. జగన్ కోరి అన్ని అస్త్రాలను బాబుకు ఇచ్చేశారు అన్న భావన కూడా పార్టీలో ఉంది. జగన్ ఒక ముఖ్యమంత్రి. పూర్తి మెజారిటీతో హాయిగా పాలన చేసుకోవాల్సిన వేళ అనవసరంగా కెలుక్కున్నారా అన్న ఆలోచనలు మాత్రం పార్టీలో చాలామందిలో కలుగుతున్నాయట. వ్యవస్థలను మ్యానేజ్ చేయడమో దిట్ట అయినా బాబుకు కోరి మరీ ఆయుధాన్ని ఇస్తే ఊరుకుంటారా అన్నది కూడా వారి ఆవేదనగా ఉందిట.
ఇదే విషయాన్ని జగన్ అత్యంత సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి మాటల్లోనే తెలుస్తోంది. ఆయన ఇపుడు బాబు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. ఏమైనా తెర వెనక కుట్రలు చేసేందుకు ఆయన కనిపించకుండా పోయారా అని అనుమానిస్తున్నారు. అది చాలు బాబు పట్ల వైసీపీ ఎంతలా భయపడుతుందో చెప్పడానికి. మరి బాబు ఇపుడు ఎవరికీ దొరకంత బిజీగా మారిపోయారు. ఆయన బుర్రకు పదును పెట్టి జగన్ కుర్చీ కిందకు నీళ్ళు తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అన్నది వైసీపీకి అర్ధమైంది. ఒక విధంగా బాబు ఇపుడు వైసీపీని భయపెడుతున్నారుగా.