అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు సంబంధించి న్యూయార్క్‌ పోస్ట్‌లో వచ్చిన కథనం కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించిన లింక్‌లను సోషల్ మీడియా బ్లాక్‌ చేయడంపై అధ్యక్షుడు ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో అవినీతి లావాదేవీలు జరిగాయంటూ ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించిన కథనం కలకలం రేపింది. హంటర్‌ ఈ మెయిల్‌లోని సమాచారాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది. హంటర్‌కు చెందిన పాత కంప్యూటర్‌ను హ్యాక్‌ చేయటం ద్వారా లభించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. నిర్ధారణ కాని ఆ ఖాతాలో సమాచారం ప్రామాణికం కాదని.. పలు విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన లింకులు బ్లాక్ అయ్యాయి. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు.

తన ప్రత్యర్థి జో బైడెన్ ను విమర్శిస్తూ ప్రచురించిన ఈ కథనాన్ని ఈ రెండు మాధ్యమాలు కావాలనే సెన్సార్ చేశాయని అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు. కాగా నిజానిజాలను నిర్ధారించుకోకుండా తాము ఈ కథనానికి సంబంధించిన లింక్‌లను పోస్ట్ చేయలేమని సోషల్ మీడియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా  తన నిర్ణయాన్ని బయటకు ప్రకటించకపోవటంతో.. ఆ వార్తను షేర్‌ చేయటానికి ప్రయత్నించి విఫలమైన యూజర్లు అయోమయానికి గురయ్యారు.

ఈ పరిస్థితిపై స్పందించిన సదరు సోషల్ మీడియా‌ యాజమాన్యం.. తాము సంస్థ నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నప్పటికీ.. తగిన వివరణ ఇవ్వకుండానే అలా చేయటం ఆమోదనీయం కాదని అంగీకరించింది. హ్యాకింగ్‌ కథనాలపై తాము స్పందించే వైఖరిలో మార్పులు చేస్తూ ఆ సోషల్ మీడియా ‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపంలో ఉన్న తరుణంలో ఈ చర్య ప్రాముఖ్యతను సంతరించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: