రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని దాటింది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ... స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నైయుద్ధ నౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్డీవో సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
బ్రహ్మోస్ క్షిపణులు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా ఛేదిస్తాయి. ఇటీవల బ్రహ్మాస్ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు, డీఆర్డీవో ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇవి షిప్పులు, సబ్ మెరైన్లు, ఎయిర్ లాంచ్ ద్వారా లక్ష్యాలను చేధించవచ్చు. భారత్-రష్యా సంయుక్తంగా తయారు చేసిన అత్యాధునిక మిస్సైల్స్ బ్రహ్మోస్.
ఐఎన్ఎస్ చెన్నైయుద్ధనౌక... 2016 నుంచి తన సేవలు అందిస్తోంది. ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15A లో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దీనిని భారతనావికా దళానికి అప్పగించారు. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ చెన్నై రెండు మల్టీరోల్ కాంబాట్ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. ఇది గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధిచేసిన యాంటీ సబ్మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి.
మొత్తానికి రక్షణ రంగంలో భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని.. చెన్నై యుద్ధ నౌక నుంచి చేసిన ప్రయోగం విజయవంతం అయింది.