అయితే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్ కు చెందిన చెవుల శిరీష, వెంకటేశ్ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో శిరీష మూడోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు ఎనిమిది నెలలు నడుస్తున్నాయి. కాగా, శనివారం రాత్రి పురిటినొప్పులు రావడంతో భర్త వెంకటేశ్ ముస్తాబాద్ లోని ఓ నర్సింగ్ హోంలో జాయిన్ చేయించాడు.
ఆస్పత్రి వైద్యులు శిరీష స్కానింగ్ చేసి పరీక్షలు నిర్వహించారు. ఆమె కడుపులో కవలలు ఉన్నట్లు గుర్తించారు. అయితే కడుపులో ఇద్దరు ఆడ శిశువులు అవిభక్తంగా ఉన్నారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కొని ఉందని, కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని చెప్పడంతో పరీక్షలకు సిద్ధమయ్యారు.
పరీక్ష విజయవంతంగా పూర్తెయింది. ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి అరుదైన ఘటనలు లక్షల్లో ఒకరికి జరుగుతుందని డాక్టర్ అనూష తెలిపారు. ఈ కవల శిశువులిద్దరూ రెండు కిలోల బరువుతో జన్మించారని, మెరుగైన చికిత్స కోసం సిద్ధిపేటలోని పిల్లల ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ అవిభక్త కవలలను చూసి వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. పిల్లలను ఎలా కాపాడుకోవాలోనని ఆవేదన చెందుతున్నారు.