తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మహా నగరం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయం కోరారు. కష్టకాలంలో తెలంగాణకు ఆపన్న హస్తం అందించేందుకు సీఎం జగన్ అంగీకరించారు. హైదరాబాద్‌లో ఏ క్షణాన ఇళ్లలోకి వరద ముంచెత్తుతోందోననే ఆందోళనతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు, ముసీ పరివాహక ప్రాంతం వరద నీటిలో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తం అ‍య్యింది. వరద ముంపు బాధితులను సురక్షిత ప్రాంంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయం కోరారు.

భారీ వర్ష సూచన ఉండటంతో సహాయక చర్యల కోసం స్పీడ్‌ బోట్స్‌ పంపించాలని సోమవారం ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను వీలైనంత త్వరగా చేరుకునేందుకు స్పీడ్‌ బోట్స్‌ అత్యవసరమని భావించిన సీఎం కేసీఆర్.. అధికారులతో సమీక్ష అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఎం జగన్‌ సాయం కోరారు. కేసీఆర్‌ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన జగన్‌.. తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా స్వీడ్‌ బోట్లను తరలించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏపీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: