బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పౌరసత్వ సవరణ చట్టం (CAA) త్వరలోనే అమల్లోకి వస్తుందని  స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ఈ చట్టం అమలులో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2021లో బెంగాల్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సమాలోచనలు జరపడానికి సోమవారం (అక్టోబర్ 19) ఈ సమావేశం నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) తో అందరికీ ప్రయోజనం కలుగుతుందిన జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ చట్టం అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లోనూ ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం గుర్తు చేశారు. కరోనా సంక్షోభం వల్ల ఏర్పడిన పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే caa అమలు చేస్తామని తెలిపారు.

మమతా బెనర్జీ ప్రభుత్వంపై జేపీ నడ్డా విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలను విభజించి పాలించే రాజకీయాలను చేస్తోందని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ (BJP) మాత్రం అలా కాదని.. అందరి అభివృద్ధి కోసం పని చేస్తుందని పేర్కొన్నారు. బెంగాల్‌‌లో 2021లో జరిగే ఎన్నికల అనంతరం బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జేపీ నడ్డా (JP Nadda) విశ్వాసం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ హయాంలో హింసాత్మక రాజకీయాలు, కట్‌-మనీ సంస్కృతికి ప్రజలు విసిగిపోయారని.. ఓటుతోనే సమాధానం చెబుతారని నడ్డా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: