ఏపీ సీఎం జగన్ ఏకంగా న్యాయవ్యవస్థలోని కొందరు పెద్దలపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పోరాటానికి అనుగుణంగా ఆయన సొంత పత్రికలో సదరు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కథనాలూ వస్తున్నాయి. ఆ పరంపరలో భాగంగా మరో సంచలన కథనం సాక్షి తాజాగా వెలుగులోకి తెచ్చింది. అదేంటంటే.. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ బీఎస్‌ఏ స్వామి గతంలో రాసిన ఓ పుస్తకంలో ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఓ పుస్తకం రాశారట.

జస్టిస్ బీఎస్‌ఏ స్వామి పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్‌ క్యాప్చర్‌ ఏపీ జ్యుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారట. అందులో ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తికీ... టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మధ్య ఉన్న బాంధవ్యాన్ని, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని స్పష్టంగా రాశారట. ఆ వివరాలను సాక్షి యథాతథంగా ప్రస్తావించింది.

ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందంటే..
“ నారా చంద్రబాబునాయుడు ఆంతరంగిక కాపలాదారు ఈ జస్టిస్‌..   వాస్తవానికి చంద్రబాబు.. ఆయన్ను రాజ్యసభకు పంపాలనుకున్నారు. కానీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ను చేశారు. న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అదనపు ఏజీ హోదాలో ఆయనేమీ పెద్ద కేసుల్లో వాదనలు వినిపించింది లేదు.
చంద్రబాబుకు, హైకోర్టు జడ్జీలకు మధ్య ఈ జస్టిస్‌ లైజనింగ్‌ చేసేవారు. న్యాయమూర్తుల అవసరాలను చూసుకునేవారు. పదవీ విరమణ తర్వాత పోస్టులిస్తామని ఆశ చూపేవారు.

తద్వారా చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు రాకుండా చూసేవారు. ఈ జస్టిస్‌  ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్‌ చేసేవారు కాదు.  ఆశావహులంతా ఆయన ఇంటి ముందు, ఆయన ఛాంబర్‌ ముందు క్యూలో నిలబడేవారు. సీనియర్‌ న్యాయమూర్తులు కూడా ఆయన చెప్పినట్లు ఆడేవారు. ఎస్‌బీ సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణే. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా ఉన్నారు.

చంద్రబాబు కోసం ఈ జస్టిస్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు వచ్చిన ప్రతి ప్రధాన న్యాయమూర్తిని ప్రలోభపెట్టేవారు. ఈ జస్టిస్‌ న్యాయ వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే, పరిస్థితులు చాలా బాగుండేవి. కానీ న్యాయ వ్యవస్థ తలరాత మరోలా ఉంది.” అని జస్టిస్ స్వామి తన పుస్తకంలో రాశారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: