చైనాలో పుట్టిన కరోనా ధాటికి ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రగతి రేట్లు పాతాళానికి పడిపోయాయి. అందులో మన భారత దేశం కూడా ఉంది. విచిత్రం ఏంటంటే.. ఇంత చేసినా.. అసలు కరోనా పుట్టిన చైనా మాత్రం ఆర్థికంగా బాగానే కోలుకుంటోంది. ప్రపంచమంతా ఆర్థికంగా పతనావస్థలో ఉంటే.. చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకుంటోంది. ఇందుకు తాజా గణాంకాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుందన్న సంగతి ఆశ్చర్యం కలిగిస్తోంది.
కరోనా కారణంగామొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. అయితే వెంటనే చైనా కోలుకుంది. మరుసటి క్వార్టర్ లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. డిమాండ్, వినియోగానికి ఊతం ఇవ్వడానికి చైనా ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలే దేశం వృద్ధి బాటన నడవడానికి కారణమని అంటున్నారు.
ఏదేమైనా.. ప్రధాన ఆర్థిక వ్యవస్థలుసహా ప్రపంచంలోని పలు దేశాల ఎకానమీలు కరోనా ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారుతుంటే కరోనాకు పుట్టినిల్లు చైనా మాత్రం వృద్ధి బాటన సాగడం విశేషమే. కరోనాకు ముందు కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉండేది. ప్రపంచానికి ముడి సరుకు సరఫరాదారుగా చైనాకు మంచి పేరు ఉంది మార్కెట్లో. ఇప్పటికీ చైనా దాన్ని కొనసాగిస్తుండటం విశేషం.