హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో ప్రజలు అందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి హైదరాబాద్ లో లేదు అనే చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా వరుసగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా మంత్రి కేటిఅర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కే. తారకరామారావు ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ తో సమావేశం అయ్యారు.

ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వారికి  కీలక సూచనలు చేసారు. రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలి అని ఆయన సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలి అని ఆదేశించారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ తక్షణ సాయం అందాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని మంత్రి స్పష్టం చేసారు. జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచనలు చేసారు.

ప్రస్తుతం ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో రిస్టోరేషన్ పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇచ్చేందుకు  ముందుకు రావాలని సూచించారు. ఇక మంత్రులతో కూడా ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: