ఇప్పటి వరకు కరోనా కారణంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్న నారా లోకేష్... ప్రజల్లోకి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన గత వారం పది రోజుల నుంచి ఎక్కువగా ప్రజలు లోనే ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కూడా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారు. ఇక తాజాగా కూడా మరోసారి ఆయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేష్ అక్కడి పరిస్థితులను తెలుసుకుని అదేవిధంగా వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా తిరిగి వారి కష్టాలను చూశారు.
దీనిపై పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ కి ఇప్పటివరకు ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిన సందర్భం లేదు అని చెప్పాలి. దీనిపై పార్టీ అధిష్టానం కూడా కాస్త సంతోషంగానే ఉంది. ఇక కార్యకర్తలతో అదేవిధంగా నాయకులతో నారా లోకేష్ మమేకమయ్యే విధానం కూడా దాదాపుగా మారింది అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. లోకేష్ గతంలో మాదిరిగా లేరు అని ఇప్పుడు కార్యకర్తలతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని గతంలో చేసిన తప్పులు పునరావృతం చేయకుండా ముందుకు అడుగులు వేస్తున్నారని పలువురు అంటున్నారు.