మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్న ట్రంప్.. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు బైడెన్కు అనుకూలంగా ఉండటంతో.. తన అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే కరోనా వ్యాక్సిన్ రాకను మరింత ఆలస్యం చేస్తారని ట్రంప్ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షాలు అమెరికన్ల జీవన విధానాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. బైడెన్ దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాడన్నారు ట్రంప్. అంతేకాకుండా ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా విడిచి వెళ్లిపోతానేమోనని ట్రంప్ పేర్కొన్నారు.
జార్జియాలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో.. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పేరును.. రిపబ్లిక్ పార్టీ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ తప్పుగా సంబోధించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విధమైన ప్రవర్తనను కమల మద్దతుదారులే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఖండించారు.
మరో వైపు డేవిడ్ పెర్డ్యూ హ్యారిస్ పేరును సరిగా ఉచ్ఛరించలేకపోయారని.. అంతే తప్ప ఆయనకు అవమానించే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఉద్దేశ పూర్వకంగానే అలా అన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అటు రిపబ్లికన్లు.. భారత సంతతి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జో బైడెన్ చైనా పట్ల వ్యవహరిస్తున్న ధోరణి భారత్కి అంత మంచిది కాదని ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు. బైడెన్పై అవినీతి ఆరోపణల గురించి తను రాసిన 'లిబరల్ ప్రివిలేజ్' పుస్తకం విజయోత్సవ కార్యక్రమంలో జూనియర్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనీయులు బైడెన్కు ఎన్నికల ప్రచారం కోసం ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇచ్చారని ఆరోపించారు.
దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేట్ జస్టిస్ రుత్ బదేర్ గిన్బర్గ స్థానంలో అమీ కానే బర్రేట్ను తీసుకువచ్చేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై మహిళల నుంచి వ్యతిరేకత వస్తోంది.
మహిళ హక్కుల లిజరల్ ఛాంపియన్ అయిన గిన్బర్గ సెప్టెంబర్ 18న మరణించారు. ఆమె స్థానంలో బర్రేట్ నామినేషన్ను ఫైనల్ చేసేందుకు రిపబ్లికన్లు తహతహలాడుతున్నారని ఆందోళకారులు విమర్శించారు.