ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి?
కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నవారికి తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సిన్ వేస్తారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా తొలి దశలో వ్యాక్సిన్ వేస్తారు.
కాబట్టి ఫార్మాట్ ప్రకారం వారి పేర్లు, పనిచేసే ఆస్పత్రి పేరు లేదా పని చేసే ప్రాంతం, మండలం, జిల్లా వంటి వివరాలతో జాబితా తయారు చేస్తారు. వారిలో ఎవరికైనా ఇప్పటివరకు కరోనా సోకిందా? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? తదితర వివరాలను కూడా పంపిస్తారు. అందుకు సంబంధించిన ఫార్మాట్ను డీఎంహెచ్వోలకు పంపించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలే మున్ముందు ప్రజలకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి వారికి తగు శిక్షణ ఇస్తారు. మొత్తం పేర్లను అన్ని రాష్ట్రాల నుంచి తీసుకున్నాక కేంద్రం డేటా బేస్ తయారు చేస్తుంది. వ్యాక్సిన్ వస్తే ముందుగా ఎంత మందికి వేయాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం ఓ అంచనాకు వస్తోంది.
కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకే మొదటి విడత వ్యాక్సిన్ తీసుకునే వైద్య సిబ్బంది జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశంలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ప్రస్తుత అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి తొలి దశలో టీకా ఇచ్చే అవకాశముంది. ప్రాధాన్యం ప్రకారం ముందుగా వైద్య సిబ్బందికి టీకా ఇస్తారు.