నవంబర్ లో 'ఇండస్ట్రీస్ స్పందన'  ప్రారంభిస్తామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఏ సమస్యకైనా సత్వరమే పరిష్కారం దిశగా పరిశ్రమల శాఖ అడుగులు వేస్తుందని అన్నారు. వెబ్ సైట్ ప్రారంభంతో మరింత చేరువ, జవాబుదారీ, పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. పరిశ్రమలకు సంబంధించిన  ఎలాంటి సందేహం, ఫిర్యాదైనా సత్వరమే స్పందన స్పష్టత  ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.  పరిశ్రమల  శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష  నిర్వహించారు. ఉన్నతాధికారులతో వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రత్యేక  'స్పందన' వెబ్ సైట్ ప్రారంభం, ఈడీబీ, పరిశ్రమల నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై చర్చ జరిపారు. పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 'గ్రీవెన్స్' స్వీకరించేలా రూపకల్పన చేయాలని అని అన్నారు. ఫిర్యాదు, సమస్య సబ్ మిట్ మీట నొక్కిన వెంటనే ఫిర్యాదుదారుడికి మెసేజ్ వచ్చే సౌలభ్యం కల్పించామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వైఎస్ ఆర్ ఏపీ వన్ లను కూడా చేర్చాలని మంత్రి ఆదేశాలు జారీ చేసారు. ఫిర్యాదు స్వీకరణ, పరిష్కారం తదితర పరిణామాలపై ఫిర్యాదుదారుడి ద్వారా 'ఫీడ్ బ్యాక్' వెసులుబాటుకు చోటు కల్పించామని చెప్పారు.

పారిశ్రామిక, పెట్టుబడిదారులకు ఇండస్ట్రీస్ వర్చువల్ ఎంట్రిప్రూనర్ డిజిటల్ అసిస్టెన్స్ కల్పిస్తామని అన్నారు. చాట్ బోట్ సౌకర్యంలో 'వేద' పేరుతో ఉన్న యానిమేషన్ బొమ్మ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తామని అన్నారు. బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని  మంత్రి సూచించారు. విశాఖ, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేయాలని అన్నారు. అందుబాటులో ఉన్న భూములను బట్టి ముందుగానే కొంత భూమిని ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. ఏపీ బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు చేయాలని మంత్రి  ఆదేశించారు. కడపలోని కొప్పర్తి కేంద్రంగా ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: