హైద‌రాబాద్‌లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు రేపు సాయంత్రం కేంద్రం బృందం రాష్ట్రానికి రానుంది.  సిటీతో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించి.. నష్టం తీవ్రతను తెలుసుకోనున్నారు.

ఈ నెల 13 నుంచి కురుస్తున్నఎడతెరిపిలేని వర్షాలతో హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచ‌నా వేసింది. తక్షణ సహాయంగా 1,350 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. తెలంగాణలో నెలకొన్న వరద పరస్థితులను, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు చేరుకోనున్న కేంద్రం బృందం.. రెండు రోజులు నగరంతో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.

ఇక తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయడం లేదన్న ఆరోపణలు సరికాదన్నారు. కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా అది ప్రజల సొమ్మేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా రాష్ట్ర విపత్తు నిధి నుంచి ఖర్చుచేసుకోవాలని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నష్టం అంచనా, కేంద్ర సహాయం విషయంలో ఒక నిర్దుష్ట విధానం ఉంటుందన్న కిషన్‌రెడ్డి... కేంద్ర బృందం నివేదిక ఆధారంగా తెలంగాణకు సహాయం ఉంటుందన్నారు.

మూసీ నదిలో ఆక్రమణలపై ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరారు.

మొత్తానికి ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నగరంలో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజల జీవనం అస్తవ్యస్తమయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలకు కంటి మీద కునుకలేకుండా పోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ఓ బృందం హైదరాబాద్ కు రానుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: