బీహార్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ కూటమి.. తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఇచ్చిన హామీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అనుభవం లేని వ్యక్తి చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దంటూ.. పరోక్షంగా ఆర్జేడీ నేత తేజస్విని విమర్శించింది.
అయితే బీజేపీ విమర్శలకు ధీటుగా బదులిచ్చారు తేజస్వి. తాను అనుభవజ్ఞుడిని కాకపోతే ఈ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ తన శక్తినంతా ఎందుకు ఉపయోగిస్తోందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి బీహార్లో సీఎం అభ్యర్థి కరవయ్యాడని ఎద్దేవా చేశారు తేజస్వి. తాను ప్రస్తుతం ప్రతిపక్షానికి నాయకుడిగా ఉన్నాననీ.. ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేశాననీ.. తన ఐదేళ్ల రాజకీయ జీవితం 50 ఏళ్ల అనుభవానికి సమానమనీ తేజస్వి బదులిచ్చారు. అయితే, ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో తేజస్విపైకి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసరడం కలకలం రేపింది. అయితే ఆయనపైకి ఎవరు చెప్పులు విసిరారో, ఎందుకు విసిరారో మాత్రం తెలియలేదు. ఎన్నికల్లో నేతలకు సరైన భద్రత కల్పించాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ''బిహార్ ఫస్ట్... బిహారీ ఫస్ట్' అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారమన్నారు. విద్యార్థులు కోచింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ప్రత్యేకంగా ''కోచింగ్ సిటీ'' ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు చిరాగ్.
ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ సభలకు ప్రజలు అధికసంఖ్యలో వస్తుండడం.. ఆయనకు మద్దతు పెరుగుతోందని సర్వేలు చెబుతుండటంతో బీజేపీ అలర్టయ్యింది. మోడీ ఎంటరవగానే సీన్ మారిపోతుందని.. ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోడీ దెబ్బకు.. తన పోర్టల్లో తన తండ్రి లాలూ ఫొటో పెట్టుకునేందుకు తేజస్వి భయపడుతున్నారని ఎద్దేవా చేసింది బీజేపీ.