నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది అని అన్నారు. గత ఏడాది జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ కూడా చెల్లించలేదని రైతాంగం ఆవేదన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ఈసారి పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా ప్రభావితం అయిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన నాయకులు పర్యటించి ముంపులో ఉన్న పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారని చెప్పారు.
ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు నష్టపోయి ఉంటాయని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళిన నాయకులు తెలియచేశారని ఆయన వివరించారు. ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది అని అన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి సాగు చేసినవారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. ఉద్యాన పంటలు వేసినవారు, కృష్ణా లంక భూముల్లో కూరగాయలు సాగు చేసేవారు, కడియం ప్రాంతంలో నర్సరీ రైతులు నష్టాల పాలయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ విపత్కర కాలంలో పెట్టుబడి రాయితీలు చెల్లిస్తాం, నష్టాలను లెక్కిస్తామని అన్నారని... ఆ ధోరణిని ప్రభుత్వం, పాలకులు విడిచిపెట్టాలని సూచించారు.