నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లు అయింది. ప్రధాని మోదీతో పాటూ కేంద్ర పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటూ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమరావతి అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 300 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులు.. శంకుస్థాపనకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. విభజన నష్టాన్ని అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు అయ్యిందన్నారు.

మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది. పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమన్నారు. శంకుస్థాపన వేడుకకు హాజరైన ప్రధాని, దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని.. అవాస్తవ ఆరోపణలతో, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో.. చట్ట విరుద్ధంగా.. రాష్ట్ర రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్య అన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపకల్పన చేయబడి.. 13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన మన రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు టీడీపీ అధినేత.


మరింత సమాచారం తెలుసుకోండి: