భారీ వర్షాలు, వరదలతో తమ ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చినట్లు ఈ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటి దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇప్పటికి రోడ్లపై, ఇళ్లలోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్నట్లు వారు వివరించారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం పట్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియా ఉద్దీన్ లు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఫలక్ నూమా ఆర్.ఓ.బి ని నిర్మించినట్లు వివరించారు.
ఈ ఆర్.ఓ.బి వలన ఇన్నర్ రింగ్రోడ్డు, చార్మినార్ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు వివరించారు. పల్లె చెరువు నుండి వచ్చే వరద నీటి నాలా 7 మీటర్ల వెడల్పు ఉంటుందని, అది ఆర్.ఓ.బి కింద నుండి వెళ్తుందని వారు పేర్కొన్నారు. పల్లె చెరువు తెగిపోవడం వలన వచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగినట్లు వారి దృష్టికి తీసుకుని వెళ్ళారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్.ఓ.బి రిటైనింగ్ వాల్వ్ దెబ్బతిన్నదని, అదే విధంగా అనేక కాలనీలు వరద ముంపుకు గురైనట్లు వారు పేర్కొన్నారు. రోడ్లపై 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు కేంద్ర బృందానికి తెలిపారు.