అమరావతి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా ఆమె తెలుసుకున్నారా? ఎమ్మెల్యేగా ఏడాదిన్నర కాలంలోనే ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందా? సొంత పార్టీలోని ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతున్నా మౌనంగా ఉండటానికి కారణం ఏంటి? ఆ అంటే రచ్చచేసే ఆమె ఓ పెద్ద విషయం జరిగినా ఎందుకు గమ్మున ఉండిపోయారు? ఇంతకీ ఎవరా మహిళా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! రాజకీయాల్లో అనుభవం తక్కువైనప్పటికీ అనతికాలంలోనే సంచలనంగా మారారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని. టీడీపీ నుంచి వైసీపీలో చేరటం.. చేరిన వెంటనే అసెంబ్లీ టికెట్ దక్కించుకోవడం.. గెలవడం వేగంగా జరిగిపోయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్తో విడదల రజనీ వివాదాలు పార్టీలు హాట్ హాట్ చర్చకు దారితీశాయి. ఆ తర్వాత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులతో గొడవలు తారాస్థాయికి వెళ్లాయనే చెప్పాలి. తనకు చెప్పకుండా నియోజకవర్గానికి వచ్చారని రెండుసార్లు ఆమెవర్గం ఎంపీని అడ్డుకోవడం సంచలనంగా మారింది.
ఇప్పుడు మరో విధంగా పార్టీలో చర్చకు కారణమయ్యారు రజని. అదీ ఆమె తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తెలిసినా మౌనంగా ఉండిపోవడంతో.. రజనీయేనా ఇలా మౌనంగా ఉన్నది అని చెవులు కొరుక్కుంటున్నారట. రజనీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆరోపణలు రావడంతో గురజాల డీఎస్పీతోపాటు సీఐని వీఆర్కు పంపారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ జోక్యంతోనే వారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్నది ఎమ్మెల్యే వర్గం చేస్తోన్న ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం. ఆ పేరుతో చర్యలు తీసుకోవాలంటే విషయం చాలా దూరం వెళ్తుంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దాని వెనక ఉంది ఎవరు? అన్నవన్నీ బయటకు రావాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఫోన్ ట్యాపింగ్ సబ్జెట్ లేకుండా డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పకపోయినా.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు పడిందనేది బయట జరిగే ప్రచారం. ఇంతవరకు బాగానే ఉన్న ఫోన్ ట్యాపింగ్పై ఎమ్మెల్యే రజనీ పల్లెత్తు మాట అనకపోవడం హాట్ టాపిక్గా మారిందట. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎమ్మెల్యే రజనీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశమే అయినా.. గుంభనంగా ఉండటం వెనక వేరే లెక్కలు ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విడదల రజని కేబినెట్లో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మధ్య మోపిదేవి, పిల్లి సుభాష్చంద్రబోస్ రాజీనామాలతో ఖాళీ అయినప్పుడే మంత్రి అయిపోతున్నట్టు భావించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ సమయంలో ఛాన్స్ మిస్ అయినా.. రెండున్నరేళ్ల పాలన తర్వాత సీఎం జగన్ తప్పకుండా పిలుస్తారనే అభిప్రాయంతో ఉన్నారట. ఇప్పుడా సమయం దగ్గర పడుతుండటంతో.. మంత్రి అయ్యే ఛాన్స్ మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో రజని మౌనంగా ఉంటున్నారనే ప్రచారం జోరందుకుంది. కేబినెట్లో బెర్త్ కోసమే కీలకమైన ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరిపైనా విమర్శలు చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు విడదల రజని. కానీ.. తెరవెనక ఏం చేయాలో అది చేస్తున్నారట. అలాగే పార్టీలోని తన ప్రత్యర్థులు ఏం చేస్తున్నా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారట. పార్టీ పెద్దలు సలహా ఇచ్చారో లేక ఇక్కడ తగ్గితే అక్కడ నెగ్గొచ్చని లెక్కలు వేసుకున్నారో కానీ ఎమ్మెల్యే రజనీ ఎత్తుగడలు మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మరి ఎన్నాళ్లిలా మౌనంగా ఉంటారో చూడాలి