కొద్ది రోజుల క్రితం అమరావతి భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై అవినీతి నిరోధక శాఖ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో అసలు ఈ విచారణ ప్రక్రియనే నిలిపేస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాదు..ఆ విచారణకు సంబంధించిన.. ఎఫ్ఐఆర్ కాపీ కి సంబంధించిన వార్తలేవీ మీడియాలో రాకూడదని గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన సంగతి కూడా వివాదాస్పదమైంది.
అయితే తాజాగా అదే హైకోర్టుకు చెందిన మరో బెంచ్ అస్సైన్డ్ భూముల కుంభకోణంలో తుళ్లూరు మాజీ తహశీల్దార్ పై వచ్చిన ఆరోపణల మీద సిఐడి దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని కీలక పరిణామంగా భావించవచ్చు. ఇలా ఏపీ హైకోర్టు తీర్పులలో వైరుధ్యాలు కనిపించాయన్న అభిప్రాయం విశ్లేషకులలో కనిపిస్తోంది. కుంభకోణాల ఆరోపణల మీద సిఐడి దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జగన్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఏదైనా దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని గతంలో కూడా సుప్రీం కోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఈ విషయాన్ని తన తీర్పులో ప్రస్తావించింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నె సుధీర్బాబు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఐడీ తరఫున పీపీ కె.శ్రీనివాసరెడ్డి, సుదీర్బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.