వర్షాలు దాదాపుగా తగ్గిపోతున్న నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు చాలా వేగంగా చేపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ వరదల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జీవో 111 అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టాలి అని ఆయన కోరారు. ఎఫ్.టి.ఎల్. నిబంధనను పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మించడం... ఆపై క్రమబద్ధీకరణ చేయడం ఓ ధోరణిగా మారింది అని అన్నారు. అర్బన్ ప్లానింగ్ లో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను చక్కదిద్దాల్సిన బాధ్యత టి.ఆర్.ఎస్.పై ఉంది అని ఆయన పేర్కొన్నారు.
“ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ఉంటారు, వెళ్లిపోతారు అన్నారు. అయితే వారు వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. అధికారులు కఠినంగా నిబంధనలు అమలు పరచాలి అని ఆయన కోరారు. సిటీ ప్లానింగ్ కు సంబంధించిన నిబంధనలు అమలు కాకుండా ప్రజా ప్రతినిధులే అడ్డుపడుతున్నారు అని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులు కలిసి పోరాడాలి అని ఆయన కోరారు. ఇలాంటి సిటీ ప్లానింగ్ లో అక్రమాలకు తావివ్వకూడదు అనేది ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రాం కావాలి అని ఆయన సూచనలు చేసారు