తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ బిడ్డ అని పాట రాయించుకున్న జగన్ రెడ్డి రాయలసీమ గడ్డ తీవ్రంగా నష్టపోతే ఎక్కడున్నాడు? అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమపై ఎన్నికలకు ముందు కురిపించిన జగన్ రెడ్డికి ప్రేమ ఎక్కడకి పోయింది? అని నిలదీశారు. వ్యవసాయ శాఖా మంత్రికి పంట నష్టాలను పరిశీలించేందుకు మొఖం చెల్లదా? అని నిలదీశారు. అదికారులకూ వరద బాధితుల్ని పరామర్శించేందుకూ తీరికలేదా? అని ఆయన ఆగ్రహంగా మాట్లాడారు.
వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతుల్ని ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా పరామర్శిస్తే ఎదురుదాడి చేస్తారా? అని మండిపడ్డారు. రైతుల కష్టాలు జగన్ రెడ్డికి కనిపించవా? అని ప్రశ్నించారు. వర్షాలతో వేరుశనగ రైతులకు తీరని నష్టం వాటిల్లింది అని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కరించే యాక్షన్లో ప్రభుత్వం ఉండాలని, ఈ రోజు ప్రజల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే రియాక్షన్ మాత్రమే ప్రభుత్వానికి ఉందని అన్నారు. పంటనష్టం లెక్కించేశాం, 39 కోట్లిచ్చామంటూ ప్రభుత్వం ప్రకటిస్తోందని, జగన్ రెడ్డి సర్కారిచ్చిన 39 కోట్లు ఒక్క మండలంలో జరిగిన పంట నష్టానికి సరిపోదని ఆయన పేర్కొన్నారు. ఒక్క వేరుశనగ పంట అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాలలో పూర్తిగా దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.