అయితే కరోనా వైరస్ ఎంతో మంది పై పంజా విసిరి బలితీసుకోవడం ఏమో కానీ ఎంతో మందికి తమ ప్రియమైన వారి కడచూపు కూడా దక్కకుండా చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఆరోగ్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రియమైన వారు కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి కడ చూపు కూడా నోచుకోలేక ఎన్నో కుటుంబాలు శోకసముద్రంలో మునిగి పోయాయి. అయితే కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన తర్వాత మృతదేహంలో ఎన్ని గంటల పాటు కరోనా వైరస్ సజీవంగా ఉంటుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు.
ఇక ఇదే విషయంపై ఎన్నో అధ్యయనాలు జరుగుతుండగా అధ్యయనాల్లో సరికొత్త విషయాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనా వైరస్ తో మరణించిన వారి మృతదేహాలలో దాదాపు 18 గంటల పాటు వైరస్ సజీవంగానే ఉంటుంది అని ఇటీవలే బెంగళూరులోని.. ఆక్స్ఫర్డ్ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. కరోనా వైరస్ బారినపడి ఆరోగ్యం విషమించి చనిపోయిన 62 ఏళ్ల వ్యక్తి యొక్క మృతదేహంపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక కరోనా వైరస్ శరీరంలో ఏ అవయవాలను దెబ్బతీస్తుంది అనే విషయాలను ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా తెలుసుకోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.